కలం, స్పోర్ట్స్: హైదరాబాద్లో గోల్ఫ్ టోర్నమెంట్ (Golf Tournament) సందడి మొదలు కానుంది. 12వ తెలంగాణ గోల్కొండ మాస్టర్స్కు రంగం సిద్ధమైంది. పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు, డీపీ వరల్డ్ పీజీటీఐ అధ్యక్షుడు కపిల్ దేవ్ కలిసి శనివారం టోర్నీని ప్రకటించారు. గోల్కొండ కోట నేపథ్యంలోని హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ వేదికగా ఈ పోటీ జరగనుంది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్లో ఈ టోర్నీ జరగనుంది. రూ.కోటి ప్రైజ్ మనీ కోసం 132 మంది గోల్ఫర్లు బరిలోకి దిగనున్నారు. ఈ టోర్నీలో దేశంలోని ప్రముఖ గోల్ఫర్లు పాల్గొంటున్నారు. డీపీ వరల్డ్ పీజీటీఐ ఆర్డర్ ఆఫ్ మెరిట్ లీడర్ సప్తక్ తల్వార్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. హనీ బైసోయా, వీర్ అహ్లావత్, రషీద్ ఖాన్, అక్షయ్ శర్మ, ఓం ప్రకాశ్ చౌహాన్ కూడా పోటీలో ఉన్నారు.
ఆసక్తికరంగా పోటీ..
గతేడాది ఛాంపియన్ జమాల్ హుస్సేన్ కూడా టైటిల్ నిలబెట్టుకునేందుకు బరిలోకి దిగుతున్నాడు. బంగ్లాదేశ్తో పాటు జపాన్, శ్రీలంక, నేపాల్, ఉగాండా, చెక్ రిపబ్లిక్కు చెందిన గోల్ఫర్లు కూడా పోటీ పడనున్నారు. హైదరాబాద్ ఆటగాళ్లు మహ్మద్ అజర్, విశేష్ శర్మ, రూపిందర్ సింగ్ గిల్పై స్థానిక అభిమానుల దృష్టి ఉండనుంది. ఈ టోర్నీకి మరో ప్రత్యేకత ఉంది. ఇది డీపీ వరల్డ్ ఇండియా ఛాంపియన్షిప్కు అర్హత సాధించే రేసులో కీలకంగా మారనుంది. ఆర్డర్ ఆఫ్ మెరిట్లో టాప్-24లో నిలిచిన ఆటగాళ్లకు సీజన్ ముగింపు ఛాంపియన్షిప్లో చోటు దక్కుతుంది. టోర్నీలో వరల్డ్ ర్యాంకింగ్ పాయింట్లు కూడా అందుబాటులో ఉంటాయి. బలమైన భారత, అంతర్జాతీయ ఆటగాళ్లతో ఈసారి పోటీ ఆసక్తికరంగా మారనుంది.

