కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ (Jagtial BJP)లో అంతర్గత అసమ్మతి రాజకీయం తీవ్ర రూపం దాల్చింది. పార్టీ నిర్వహణ, స్థానిక నాయకత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకులు, పాత కార్యకర్తలు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు అత్యవసరంగా సమావేశమయ్యారు.
300 మందికి పైగా హాజరు.. అధిష్టానంపై గుర్రు
జగిత్యాల పట్టణ పరిధిలో శనివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమీక్షా సమావేశానికి సుమారు 300 మందికి పైగా సీనియర్ నేతలు, మండల స్థాయి అధ్యక్యాక్షులు, విభాగాల ప్రతినిధులు హాజరయ్యారు. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసి అనేక ఆందోళనల్లో భాగస్వాములైన సీనియర్ కార్యకర్తలను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారని సమావేశంలో హాజరైన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి లేదా కొందరి వర్గానికే ప్రాధాన్యం ఇస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
అధిష్టానానికి నివేదిక
పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న సీనియర్లకు కమిటీలలో తగిన స్థానం కల్పించాలని, స్థానిక నిర్ణయాల్లో సీనియర్లందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, సమావేశంలో చర్చించిన అంశాలు, సీనియర్ల అసంతృప్తికి గల కారణాలతో ప్రత్యేక నివేదికను సిద్ధం చేసి వెంటనే బిజెపి రాష్ట్ర అధిష్టానానికి పంపాలని నిర్ణయించారు. స్థానిక నాయకత్వం తన వైఖరిని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో తమ భవిష్యత్తు కార్యాచరణను మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశం జగిత్యాల జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.

