కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ సమక్షంలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర గీతంతో ప్రారంభమై సాయంత్రం 3:40 గంటలకు జాతీయ గీతంతో ముగిసింది. నగరపాలక సంస్థ ప్రగతి, ప్రజారోగ్యం, అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పొందుపరిచిన మొత్తం 180 ఎజెండా అంశాలపై పాలకవర్గం సుదీర్ఘంగా చర్చించి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ప్రశ్నోత్తరాల సమయం – విజ్ఞప్తుల వెల్లువ..
నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశ విజ్ఞప్తుల సమయంలో డివిజన్ల వారిగా పాలకవర్గ సభ్యలు ప్రజల సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా నగర పారిశుధ్యం, వీదిదీపాల నిర్వహణ, త్రాగు నీటి సమస్య, ప్లాస్టిక్ నివారణ, పర్యావరణ పరిరక్షణ, కుక్కలు, కోతుల బెడద, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం ఆధునీకరణ, స్మశాన వాటికల అభివృద్ధి, పారిశుధ్య కార్మికుల కొరత, పరిపాలనాంశాలైన భవన నిర్మాణ అనుమతులు, డిజిటల్ ఇంటి నంబర్లు, విలీన గ్రామల డివిజన్ల ఇంటి నెంబర్ల ఆన్ లైన్ ప్రక్రియ, రోడ్లు, ఫుట్ పాత్ ఆక్రమణలు, డివిజన్లలో కార్మీకులు, సిబ్బంది కొరత, చికెన్, బయోమెడికల్, ఇతర వ్యర్థాల నిర్వహణ, ఫంక్షన్ హాల్స్ లో ప్లాస్టిక్ నివారణ చర్యలు, అంతిమయాత్ర ఆఖరి సఫర్ నిర్వహణ, మంచినీటి సరఫరా లీకేజీలు, ఖాళీ స్థలాల పరిశుభ్రత, అపార్ట్మెంట్ లలో ఆస్తి పన్నుల వెత్యాసాల సవరణ, ఇందిరమ్మ గృహాలు, నగరపాలక సంస్థ పరిదిలోని 22 ఏ భూముల పరిష్కారం, పండగల నిర్వాహణ, ఆస్తిపన్నుల హెచ్చుతగ్గులు, నగరపాలక సంస్థ పార్కు స్థలాల పరిరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణం తదితర అంశాలు, సమస్యల పై సభ్యులు సభ దృష్టికి తెచ్చారు.
మేయర్, కమీషనర్ల హామీ..
పాలకవర్గ సభ్యులు లేవనెత్తిన ప్రతి సమస్యపై మేయర్ కొలగాని శ్రీనివాస్, కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ సానుకూలంగా స్పందిస్తూ సమగ్ర వివరణ ఇచ్చారు. డివిజన్ల వారీగా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరలోనే పూర్తి చేస్తామని, ప్రజారోగ్యానికి, అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ కరీంనగర్ను మోడల్ నగరంగా తీర్చిదిద్దడానికి పాలకవర్గం, అధికారులు సమన్వయంతో ముందుకుసాగాలని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ పలు విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధినిర్వహాణ చేయాలని… ప్రజలకు, పాలకవర్గానికి జవాబుదారితనంగా వ్యవహరించాలని సభలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. కరీంనగర్ నగరపాలక సంస్థ ను ప్లాస్టిక్ రహిత మోడల్ నగరంగా తీర్చిదిద్దేందుకు పాలకవర్గం పని చేస్తుందని తెలిపారు. వచ్చే గణేష్ ఉత్సవాల ఏర్పాట్లు, మండపాలకు ఉచిత కరెంట్ అందించేందుకు సభలో పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందన్నారు. నగరం తో పాటు నూతనంగా విలీనమైన గ్రామాల డివిజన్లు సరైన మౌలిక వసతులు కల్పించేలా అన్ని అంశాలను పొందుపరిచి ఆమోదించామని పేర్కొన్నారు.
ప్రధాన సమస్య అయిన డంపింగ్ యార్డును స్వచ్చ్ భారత్ మిషన్ కింద రూ.17 కోట్ల నిధులు కేటాయించి టెండర్ ప్రక్రియ చేపడుతున్నామని వివరించారు. స్మార్ట్ సిటీ నుండి 8 కోట్లు నిధులు కేటాయించి.. ప్రక్షాళన చేసి ప్రజల సమస్యను తొలగిస్తామన్నారు. నగరపాలక సంస్థ పారిశధ్యంను మరింత మెరుగుపరిచేందుకు.. పాలకవర్గ సభ్యులు కోరిన ప్రకారం యంత్రాలు, వాహనాలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. జేసీబి, లాడర్లు, ఫాగింగ్ యంత్రాలు, అంతిమయాత్ర రథాలు, బ్లేడ్ ట్రాక్టర్లు, రిక్షాలను కొనుగోలు చేసి డివిజన్లలో పారిశుధ్య సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలోని 66 డివిజన్లకు సంబంధించి పాలకవర్గ సభ్యులు దృష్టికి తెచ్చిన ప్రతి ప్రజా సమస్యను దశలవారిగా పరిష్కరించి.. అభివృద్ధి సంక్షేమంతో ముందుకు సాగుతామని తెలిపారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహాకారంతో కరీంనగర్ నగరపాలక సంస్థను అర్బన్ చాలేంజ్ ఫండ్ పథకంలో చేర్చి.. రూ.840 కోట్ల అభివృద్ధి ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. త్వరలోనే యూసీఎఫ్ పనులు కూడ ప్రారంభం చేస్తామని తెలిపారు. అంతే కాకుండా యూఐడిఎఫ్ పథకంలో పలు డివిజన్లలో అభివృద్ధి పనులను ప్రారంభం చేశామని తెలిపారు. యూఐడిఎఫ్ పథకంలోని పనులను ప్రారంభం చేయని కాంట్రాక్టర్లను త్వరలోనే ప్రారంభం చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎలాంటి అవినీతికి తావులేకుండా మా పాలకవర్గం అభివృద్ధి సంక్షేమమే ద్యేయంగా పని చేస్తుందని తెలిపారు. నగరంలో సభ్యులు దృష్టికి తెచ్చిన కుక్కలు, కోతుల సమస్యల నుండి ప్రజలకు విముక్తి కలిగిస్తామన్నారు. గతంలోనే నగరపాలక సంస్థ కుక్కల సమస్యకు ఆంటీ బర్థ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభం చేసి.. కుక్కలకు జనన నియంత్రణ ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు.
ప్రస్తుత ఏబిసి సెంటర్ లో ఇంకా కెపాసిటీ పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కెనల్స్ సంఖ్యను పెంచడంతో పాటు కంపోండ్ వాల్, వసతుల సౌకర్యం కోసం 2 కోట్ల నిధులు కేటాయించి టెండర్ ప్రక్రియ చేపట్టామని తెలిపారు. ఏబిసి సెంటర్ లో 150 కెనల్స్ ఏర్పాటు చేసి ఆపరేషన్ చేసేలా చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు. నగర వ్యాప్తంగా కుక్కల బెడద ప్రధాన సమస్యగా మారిందని…నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల పరిష్కారం పై సీడీఎంఏ దృష్టికి తీస్కేల్లామని తెలిపారు. నగరంలో ఫంక్షన్ హాల్స్ లో ప్లాస్టిక్ వాడకుండా చర్యలు తీసుకుంటామని కరీంనగర్ నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ గా మార్చుతామని తెలిపారు. నగరంలో అర్హులందరికి ఇందిరమ్మ గృహాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలోని ఖాళీ స్థలాల్లో బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
విలీన గ్రామాల డివిజన్ల నల్లా కనెక్షన్లను 100 రూ కట్టి 4 నెలల్లో ఆన్ లైన్ చేసుకోవాలని అన్నారు. నగరపాలక సంస్థ విభాగాల్లో పని చేసే అధికారులు సిబ్బంది జవాబు దారితనంగా పని చేయాలని ప్రజలు, పాలకవర్గ సభ్యులు తెలిపే సమస్యలకు స్పందించి పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. విలీన గ్రామాల డివిజన్ల కు సంబంధించిన ఇంటి నెంబర్లను ఆన్ లైన్ ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు. నగరపాలక సంస్థ అన్ని డివిజన్ల లో త్వరలోనే వార్డు కార్యాలయాలు నిర్మాణం చేస్తామని తెలిపారు. డివిజన్ల లో నగరపాలక సంస్థ పార్కులు, ప్రభుత్వ స్థలాల కాపాడుకునేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాలకవర్గ సభ్యులు సభ దృష్టికి తెచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పాలకవర్గ సభ్యులు, అధికారుల పాల్గొన్నారు.

