కలం, మేళ్లచెరువు (సూర్యాపేట) : ఇంటి పక్కన ఉన్న చిన్న వేపచెట్టు వివాదం, పాతకక్షలు తోడై తీవ్ర విషాదానికి దారితీసింది. రెండు వర్గాలు గొడ్డళ్లతో భీకరంగా దాడి చేసుకోవడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ సంఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు (Mellacheruvu) మండలం ఎర్రగట్టు తండాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగట్టు తండాలో ఇంటి పక్కనే ఉన్న వేపచెట్టు విషయంలో రెండు వర్గాల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈక్రమంలో శనివారం పాతకక్షలు మనసులో పెట్టుకుని ఇరువర్గాల వారు తీవ్ర ఘర్షణకు దిగారు. మాటామాటా పెరగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఇరు వర్గాలు గొడ్డళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు.
ఈ భీకర దాడిలో తీవ్ర గాయాలపాలై వెంకటేశ్వర్లు యాదవ్, సైదా అనే ఇద్దరు వ్యక్తులు రక్తపు మడుగులో ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. తండాలో మళ్లీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

