కలం, వెబ్ డెస్క్: ఒకప్పుడు రాఖీ పండుగ వచ్చిందంటే బీఆర్ఎస్, వైఎస్సార్సీపీకి చెందిన సోషల్ మీడియాలో ఆప్యాయతతో కూడిన అనుబంధాల ఫొటోలు దర్శనమిచ్చేవి. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని గుర్తు చేస్తూ పోస్టులు పెట్టేవారు. “అన్నకు అక్కాచెల్లెళ్లే తోడు.. చెల్లికి అన్నే అండ” అంటూ సోదరసోదరీమణుల మధ్య ఉన్న ఆప్యాయత, అనుబంధాన్ని చాటేవారు.
కానీ కాలం మారింది.. ఒకప్పుడు రాఖీ పండుగ సందర్భంగా రాజకీయంగా ఎంతో ఆర్భాటంగా కనిపించిన ఈ సిస్టర్స్ (Kavitha – Sharmila) అనుబంధం ఇప్పుడు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల ఒకప్పుడు దగ్గరగా కనిపించిన ఈ రాజకీయ ‘తోబుట్టువులు’ రాజకీయంగా ఇప్పుడు దూరమయ్యారు.
ఇక్కడ కవిత, అక్కడ షర్మిల
రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా నిలిచిన కవిత, ఏపీ రాజకీయాల్లో ప్రముఖ నేతగా ఉన్న షర్మిల కూడా ఈ సారి వేడుకలకు దూరమయ్యారు. గతంలో రాఖీ పండుగ సందర్భంగా అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాలు, సందేశాలతో కనిపించేవారు. వీరిద్దరూ (Kavitha – Sharmila) ఈసారి మాత్రం అలాంటి సందడి లేకుండా ఉండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. కుటుంబ బంధాలు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో కవిత, షర్మిల ఈ రాఖీ పండుగకు దూరమైనట్టుగా స్పష్టంగా తెలుస్తోంది.

