కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్పొరేషన్ చైర్మన్గా కొణిదెల నాగబాబు (Nagababu) బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని అరణ్య భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాగబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడం, పర్యావరణ పరిరక్షణ, అటవీ ప్రాంతాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షిస్తూ రాష్ట్రాన్ని గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

