కలం, హనుమకొండ : గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలను నియంత్రించేందుకు అనుమానాస్పద ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి (Chaahat Bajpai) అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు.
గత మూడు నెలల్లో జిల్లాలోని స్కానింగ్ సెంటర్లలో నిర్వహించిన తనిఖీల వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్యను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల నివేదికలను పరిశీలించడంతో పాటు కొత్త అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను సమీక్షించారు. అనుమానాస్పద కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
అనుమతి పొందిన వైద్యులు కాకుండా ఇతరులు స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లింగ నిర్ధారణకు సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.50 వేల పారితోషికం అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్నేత, జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, డాక్టర్ రజిత, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఒంటేరు రమేష్, నీతా, వి.అశోక్రెడ్డి, పద్మజ తదితరులు పాల్గొన్నారు.

