కలం, నిర్మల్: రక్షాబంధన్ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో విద్యార్థినులు, బ్రహ్మకుమారీస్ సభ్యులు జిల్లా ఎస్పీ (Adilabad SP) అఖిల్ మహాజన్కు (Akhil Mahajan) గురువారం రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థినులు, బ్రహ్మకుమారీస్ సభ్యులతో పాటు ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత ఎస్పీకి రాఖీ కట్టి మిఠాయి తినిపించారు.
అదేవిధంగా దాబా (బి) గ్రామంలో నిర్వహించిన ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో ఇచ్చోడ విద్యాలయ విద్యార్థులు డ్రగ్స్ నివారణ, రోడ్డు భద్రతపై కళా ప్రదర్శన నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు ఎస్పీ అఖిల్ మహాజన్కు రాఖీ కట్టి తమకు రక్షగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, బాలికల భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, చదువుపై ప్రత్యేక దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.

