కలం, ఖమ్మం బ్యూరో: ఓటరు జాబితాలో మీ పేరు భద్రంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఇదే సరైన అవకాశం. భద్రాద్రి కొత్తగూడెం ( Bhadradri Kothagudem) జిల్లావ్యాప్తంగా రేపు (ఈ నెల 27, గురువారం) ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అంకిత్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కు ఎంతో కీలకమని, అందుకే ముసాయిదా ఓటరు జాబితాను నేరుగా ప్రజల సమక్షంలోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమం కింద జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా గ్రామసభలు జరగనున్నాయి. ఈ సభల్లో సంబంధిత బూత్ లెవల్ అధికారులు (BLOలు) ముసాయిదా ఓటరు జాబితాను బిగ్గరగా చదివి వినిపిస్తారు. జాబితాలో మీ పేరు ఉందో లేదో సరిచూసుకోవడంతో పాటు తప్పుల సవరణలు, కొత్తగా ఓటు నమోదు లేదా మార్పుల గురించిన వివరాలను బిఎల్ఓల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చు.
ఓటు హక్కు పట్ల నిర్లక్ష్యం వహించకుండా, రేపు నిర్వహించే ఈ గ్రామసభలకు ఓటర్లందరూ తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ విజ్ఞప్తి చేశారు. బాధ్యతాయుతంగా మీ ఓటును తనిఖీ చేసుకుని, ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
Also Read : తెలంగాణ యువ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్న్యూస్
Follow Us On: X(Twitter)

