కలం, వెబ్ డెస్క్ : నెల్లూరు జిల్లా, అనంతసాగరం(Ananthasagaram) గ్రామంలో పోలీసుల కార్డన్ సెర్చ్లో(Cordon and Search) ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా ఇళ్లు, వాహనాల పత్రాలను పరిశీలిస్తుండగా ఓ ఆరేళ్ల బాలుడు తన తండ్రి దాచిన బైక్ను పోలీసులకు చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సురేశ్ అనే వ్యక్తి పోలీసుల తనిఖీల భయంతో తన బైక్ను పక్క వీధిలోని ఓ ఇంట్లో దాచిపెట్టాడు. ఇదంతా గమనించిన సురేశ్ కుమారుడు మహేంద్ర పోలీసులు తనిఖీలకు వచ్చిన సమయంలో వారి వద్దకు వెళ్లి “సార్.. మీరు వస్తున్నారని మా నాన్న బైక్ అక్కడ దాచిపెట్టాడు.. రండి చూపిస్తా” అంటూ పోలీసులను వెంట తీసుకెళ్లాడు.
బాలుడి మాటలతో పోలీసులు అక్కడికి వెళ్లి బైక్ను గుర్తించారు. అనంతరం వాహనానికి సంబంధించిన పత్రాలను పరిశీలించగా అవన్నీ సక్రమంగానే ఉన్నట్లు తేలింది. పోలీసుల తనిఖీల భయంతోనే సురేశ్ బైక్ను దాచినట్లు తెలిసింది. తండ్రి చేసిన పనిని దాచకుండా నిజాయితీగా పోలీసులకు చెప్పిన మహేంద్రను పోలీసులు, స్థానికులు అభినందించారు. చిన్న వయసులోనే నిజాయితీ చూపించిన బాలుడిని “శభాష్ మహేంద్ర” అంటూ ప్రశంసించారు.

