కలం, యాదగిరిగుట్ట: కల్లు గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (MLA Beerla Ilaiah) అన్నారు. ఆలేరు పట్టణంలో బుధవారం 250 మంది కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయిలయ్య మాట్లాడుతూ.. కల్లుగీత కార్మికుల సంక్షేమం, భద్రతకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
కల్లు గీత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు తాటి చెట్లు ఎక్కే సమయంలో ప్రమాదాలకు గురికాకుండా వారికి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ కిట్లను అందిస్తోందని తెలిపారు. కార్మికుల ప్రాణాలను కాపాడటంతో పాటు, వారి కుటుంబాలకు భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమన్నారు. ఆలేరు నియోజకవర్గంలో కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కల్లుగీత కార్మికుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవసరమైన మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కార్మికులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, గీత కార్మిక సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కల్లుగీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

