కలం, నల్లగొండ: ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) మంజూరులో అక్రమాలకు పాల్పడ్డ ప్రభుత్వ ఉద్యోగిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. లబ్ధిదారుడి నుంచి డబ్బులు తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో చర్యలు తీసుకున్నారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ (Thirumalagiri Sagar) మండల గృహ నిర్మాణ శాఖ ఔట్సోర్సింగ్ అసిస్టెంట్ ఇంజినీర్గా పని చేస్తున్న భూక్య గోపిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు ఏఈ గోపి డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటున్నారని బాధితులు రాష్ట్ర గృహ నిర్మాణ కార్పొరేషన్కు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన కార్పొరేషన్ అధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ అధికారులు చేపట్టిన విచారణలో ఏఈ లంచం తీసుకున్న విషయం నిజమేనని తేలింది. విజిలెన్స్ సమర్పించిన నివేదిక ఆధారంగా కలెక్టర్ ఆయనను తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, నిర్మాణ వ్యవహారాల్లో ఎవరు అక్రమాలకు పాల్పడినా సహించేది లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. గృహ నిర్మాణ శాఖ అధికారులందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని, బాధ్యతా రాహిత్యంగా ఉన్నా లేదా లంచాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

