కలం, కరీంనగర్ బ్యూరో: హుస్నాబాద్ (Husnabad) నియోజకవర్గంలో బీఆర్ఎస్ (BRS) పార్టీకి షాక్ తగిలింది. చిగురుమామిడి (Chigurumamidi) మండల కేంద్ర సర్పంచ్ ఆకవరం భవాని శివప్రసాద్, యువ నాయకులు సాయిచరణ్లు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. చిగురు మామిడి సర్పంచ్ భవాని కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని, చిగురు మామిడి మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా చిగురు మామిడి మండల కేంద్రానికి మోడల్ స్కూల్ ఇచ్చామని తెలిపారు. అదే విధంగా కరీంనగర్ – హుస్నాబాద్ ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ అభివృద్ధిని చూసి సర్పంచ్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారని పేర్కొన్నారు.
అనంతరం సర్పంచ్ ఆకవరం భవాని శివప్రసాద్ మాట్లాడుతూ.. చిగురు మామిడి గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. చిగురు మామిడి మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో రాబోయే రోజుల్లో మండలాన్ని మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

