కలం, నిర్మల్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం బీఎస్ఎన్ఎల్ టెలికం అడ్వైజరీ కమిటీ సమావేశం ఎంపీ(Adilabad MP) గోడం నగేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సేవల మెరుగుదల, కొత్త టవర్ల ఏర్పాటు, వినియోగదారుల సమస్యల పరిష్కారంపై సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ నిజామాబాద్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎంపీ గోడం నగేష్ సూచనలు, ప్రోత్సాహంతో నెట్వర్క్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సేవలను మరింత మెరుగుపరచడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త టవర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
వినియోగదారులు ఎదుర్కొంటున్న నెట్వర్క్ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టెలికం అడ్వైజరీ కమిటీ సభ్యులు బుర్ర రమేష్ గౌడ్, ఎస్. కృష్ణకుమార్, కొండా ప్రభాకర్ గౌడ్, వినోద్ కుమార్, బీఎస్ఎన్ఎల్ డీజీఎం జగ్రామ్, నిర్మల్ డీఈ రాకేష్ గౌడ్, ఎస్డీఈ ప్రవీణ్ మోరే తదితరులు పాల్గొన్నారు.

