కలం, వెబ్ డెస్క్ : ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కాంగ్రెస్ లో తీవ్ర కలకలం రేగింది. మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు పరస్పరం అసభ్య పదజాలంతో దూషించుకుంటూ వివాదానికి దిగారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, నియోజకవర్గ ఇన్ చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో గొడవపడ్డారు.
పార్టీ పీఏసీ సమావేశానికి అల్లూరి సంజీవరెడ్డి ఎలా హాజరవుతారంటూ కంది శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి పరిస్థితి హద్దులు దాటింది. నాయకులు ఒకరినొకరు తీవ్ర పదజాలంతో బూతులు తిట్టుకోవడంతో సమావేశ ప్రాంగణంలో గందరగోళ వాతావరణం నెలకొంది. మంత్రి జూపల్లి కృష్ణారావు ముందే నేతలు ఈ రీతిలో వ్యవహరించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సమావేశంలో చోటుచేసుకున్న ఈ వ్యవహారాన్ని ఏఐసీసీ తీవ్రంగా పరిగణించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి బాహాటంగా ఘర్షణకు దిగిన ఇరువర్గాల నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని ఏఐసీసీ కార్యదర్శి హెచ్చరించారు.

