కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. రాబోయే ఏడాదిన్నర కాలంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్, అల్వాల్ టిమ్స్, ఎల్బీనగర్ టిమ్స్ (TIMS Hospitals), వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లను వరుసగా ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఏ కార్పొరేట్ ఆసుపత్రికి తీసిపోని విధంగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
ఈ మేరకు టిమ్స్ ఆసుపత్రిని డిప్యూటీ సీఎం భట్టి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాతో కలిసి సోమవారం సీఎం ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్, సనత్నగర్, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్, వరంగల్ ఆసుపత్రిని అత్యంత ప్రాధాన్యతతో నిధులు కేటాయించి వేగంగా నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని తెలిపారు.
ఈ ఆసుపత్రులన్నీ పూర్తయితే రాష్ట్రంలో 10 వేల పడకల ఆసుపత్రులు పేదలకు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఎయిమ్స్తో పోటీపడే సేవలు అందిస్తున్న నిమ్స్ (NIMS) ఆసుపత్రికి ధీటుగా ఒక్కో ఆసుపత్రికి ఒక్కో డైరెక్టర్ను నియమించి వారి పర్యవేక్షణలో వీటిని తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగంలో ఇప్పటి వరకు 16 వేల మంది సిబ్బందిని నియమించామన్నారు.
తమ 32 నెలల ప్రజా పాలనలో ప్రజలు ఆరోగ్యం కోసం దాదాపుగా రూ. 2,700 కోట్లు ఖర్చు పెట్టామని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి రూ. 2,526 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. ఈ రెండు పథకాల ద్వారా వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో రూ. 5,226 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఉస్మానియా హాస్పిటల్ పక్కనే గోషమహల్లో 30 ఎకరాల్లో రూ.2,700 కోట్లతో 200 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నా,మని.. తొందర్లోనే దాన్ని పూర్తి చేసుకోబోతున్నామని తెలిపారు.

