కలం, నిర్మల్: జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి మీ ప్రమాణం ముఖ గుర్తింపు హాజరు యాప్ లో నమోదు కావాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Nirmal Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన మీ ప్రమాణం యాప్ నమోదు, జిల్లా సెన్సస్ హ్యాండ్ బుక్ రూపకల్పన అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ప్రతి స్థాయి రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మీ ప్రమాణం యాప్ ద్వారానే హాజరు నమోదు చేసుకోవాలన్నారు.
ఇప్పటివరకు నమోదు కాని శాఖలు వెంటనే నమోదు చేసుకోవాలని ఆదేశించారు. మీ ప్రమాణం హాజరు నమోదులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాఖాధిపతులు తప్పనిసరిగా ఎప్పటికప్పుడు సిబ్బంది హాజరు వివరాలు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. అలాగే జిల్లా సెన్సస్ హ్యాండ్ బుక్ రూపకల్పన కోరకు, సంబంధిత శాఖల అధికారులు నిర్దేశిత సమాచారం అందించాలని ఆదేశించారు. శాఖల వారిగా అందించే ప్రతి సమాచారం పక్కాగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డిఆర్ఓ రాథోడ్ రమేష్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

