నికి పూనాచా గ్రాండ్ విక్టరీ.. ఏటీపీ డబుల్స్ టైటిల్ భారత్ సొంతం!

క‌లం, వెబ్‌డెస్క్‌: భారత టెన్నిస్ స్టార్ నికి కల్యాండ పూనాచా (Niki Poonacha) అంతర్జాతీయ వేదికపై మరో ఘనవిజయాన్ని సాధించారు. అమెరికాలో జరిగిన ఇండయానా హార్డ్‌కోర్ట్ ఛాంపియన్‌షిప్‌ 2026 డబుల్స్ టైటిల్‌ను ఆయన కైవసం చేసుకున్నారు. ఎక్వడార్‌కు చెందిన గొంజాలొ ఎస్కోబార్‌తో కలిసి నికి ఈ ఘనత సాధించారు. శనివారం బీబీ విన్ కోర్టులో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నికి-ఎస్కోబార్ జోడీ అద్భుత ప్రదర్శన చేసింది. రెండో సీడ్ జోడీ అయిన అమెరికాకు చెందిన రాబర్ట్ కాష్, నెదర్లాండ్స్‌కు చెందిన బార్ట్ స్టీవెన్స్‌లపై 6-4, 6-1 తేడాతో విజయం సాధించింది. గత వారం లెగ్జింగ్టన్ ఓపెన్ గెలిచిన ఈ జోడీకి ఇది వరుసగా రెండో డబుల్స్ టైటిల్ కావడం విశేషం.

ఈ టోర్నీలో నికి-ఎస్కోబార్ జంట ఒక్క సెట్ కూడా ఓడిపోకుండా ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి రౌండ్‌లో అమెరికాకు చెందిన మైకేల్ ఆండ్రే, సామ్ లాండౌలను 6-3, 6-4తో ఓడించి బోణీ కొట్టారు. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్స్‌లో అమెరికాకే చెందిన నథానియల్ లామన్స్, జాక్సన్ విత్రోలను 6-4, 6-4తో చిత్తు చేశారు. సెమీఫైనల్స్‌లో ఆస్ట్రేలియా జంట అజీత్ రాయ్, జేమ్స్ వాట్‌లను 7-6(4), 7-6(2)తో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఫైనల్ మ్యాచ్ తొలి సెట్‌లో చివరి వరకు హోరాహోరీగా సాగినా, పదో గేమ్‌లో నికి జోడీ బ్రేక్ పాయింట్ సాధించి 6-4తో సెట్‌ను గెలుచుకుంది.

ఇక రెండో సెట్‌లో పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తూ రెండు, ఆరో గేమ్‌లలో బ్రేక్ సాధించి కేవలం ఒక గంట 14 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. ఈ విజయంతో 31 ఏళ్ల నికి పూనాచా తన కెరీర్‌లో 12వ ఏటీపీ ఛాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను నమోదు చేసుకున్నారు. ఇది ఈ 2026 సీజన్‌లో ఆయనకు ఆరో టైటిల్ కావడం విశేషం. ఈ విజయంతో లైవ్ ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నికి 81వ స్థానానికి చేరుకున్నారు. రాబోయే ఆసియన్ గేమ్స్‌కు రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న నికి, ప్రస్తుతం భారతదేశంలో యుకి భంబ్రీ, శ్రీరామ్ బాలాజీల తర్వాత మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>