కలం, వెబ్ డెస్క్ : తిరుమలలోని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తూంటారు. ఈ నేపథ్యంలోనే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. తాజాగా తిరుమల శ్రీవారి దర్శనం, గదుల (Tirumala Darshan Tickets ) నవంబర్ కోటా షెడ్యూల్ను తాజాగా టీటీడీ రిలీజ్ చేసింది.
దీని ప్రకారం.. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను సంబంధించిన నవంబర్ నెల కోటాను ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ రిలీజ్ చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగస్టు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు ఆగస్టు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బు చెల్లించిన వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయి.
అలాగే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఆగస్టు 21న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్లో విడుదల చేస్తారు. అదే రోజున వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇక ఈ నెల 2న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు , శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుండగా.. ఆగస్టు 25న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను , మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా భక్తులు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.

