కలం, ఖమ్మం బ్యూరో: రవాణా సౌకర్యాల మెరుగుదలతోనే గ్రామీణ వికాసం సాధ్యమవుతుందని, గ్రామీణ ప్రాంతాల స్వరూపాన్ని మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. శనివారం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్తో కలిసి బోనకల్ మండలంలో రూ. 7.66 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు కీలక అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. మధిర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుంచుతామని పునరుద్ఘాటించారు. బోనకల్ మండలం చొప్పకట్లపాలెం గ్రామం నుండి దబ్బాకుపల్లి గ్రామం వరకు రూ. 4 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీటీ లింక్ రోడ్డు పనులతో పాటు చొప్పకట్లపాలెం ఎస్సీ కాలనీలో రూ. 1.06 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేశారు.
అనంతరం రామాపురం గ్రామం నుండి పాతర్లపాడు వరకు రూ. 2.60 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. రహదారుల నిర్మాణంతో గ్రామాల మధ్య అనుసంధానం పెరిగి ప్రజలకు రాకపోకలు సులభతరం కావడమే కాకుండా, స్థానిక ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో గ్రామీణులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పీఆర్ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ యుగంధర్ రావు, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

