కలం, వెబ్డెస్క్: ఆగస్టు 15 సాయంత్రం 7:29 గంటల సమయం క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ ప్రత్యేకమే. MS ధోనీ (MS Dhoni) అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి ఆరేళ్లు పూర్తయినా, ఆ సమయం ఇప్పటికీ అందరి గుండెల్లో నిలిచిపోయింది. డిసెంబర్ 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ధోనీ, ఐసీసీకి చెందిన మూడు పరిమిత ఓవర్ల ట్రోఫీలను అందించిన ఏకైక నాయకుడిగా రికార్డు సృష్టించాడు. ఆయన సారథ్యంలోనే భారత్ 2007లో టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఆ తర్వాత 2011లో వాంఖడే స్టేడియంలో ధోనీ సిక్సర్తో మ్యాచ్ను ముగించి, భారత్కు వన్డే వరల్డ్ కప్ అందించాడు.
2013లో ఆయన కెప్టెన్సీలోనే జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. కెప్టెన్గా 60 టెస్టుల్లో 27 విజయాలు అందించిన ధోనీ, 72 టీ20లలో 41 గెలుపులు సాధించాడు. తన కెరీర్లో 350 వన్డేలలో 10,773 పరుగులు, 90 టెస్టుల్లో 4,876 పరుగులు చేశాడు. 98 టీ20 లలో ప్రాతినిధ్యం వహించడంతో పాటు, వికెట్ కీపర్గా 829 డిస్మిసల్స్ పూర్తి చేశాడు. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్తో ధోనీ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
ఏడాది తర్వాత 2020 ఆగస్టు 15న ఎటువంటి ప్రెస్ మీట్ లేకుండా, సోషల్ మీడియాలో “మై పల్ దో పల్ కా షాయర్ హూన్” పాటతో తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలిగినా, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా 2023తో కలిపి ఐదు ట్రోఫీలు అందించాడు. సమర్థవంతమైన నాయకత్వం, అద్భుతమైన ముగింపులు, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండటం ధోనీ ప్రత్యేకత. ఆయన చూపిన ప్రశాంతత, సాధించిన విజయాలు భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి.

