కలం, వెబ్డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో ఈ కార్డులను రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోటి 6 లక్షల స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయనున్నారు. 15 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగనుంది. సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా తదితరులు పాల్గొన్నారు. దీనికి ముందు సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీల విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ విషయంలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. గత పదేళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డ్ కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కొత్త రేషన్ కార్డులు అందజేశామని చెప్పారు. కొత్తగా 16 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది అని ఉత్తమ్ తెలిపారు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే ఎవరూ తినేవారు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే సన్న బియ్యం ఇవ్వడం స్టార్ట్ చేశామని చెప్పారు. దేశంలో తెలంగాణలో తప్ప ఎక్కడా సన్న బియ్యం ఇవ్వడం లేదన్నారు. గతంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టేదన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

