కలం, నిర్మల్: ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ముధోల్ ఎమ్మెల్యే (Mudhol MLA) పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం భైంసా (Bhainsa) పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొందిన భారత్ 80 ఏళ్లలో అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. అనంతరం భైంసా బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

