కలం, మెదక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. శనివారం సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొనే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా సంగారెడ్డి శివారు హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్లో చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం 2.15 గంటలకు సంగారెడ్డి టౌన్లోని అంబేద్కర్ స్టేడియానికి చేరుకుంటారు. ఇక్కడ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది. ఈ కార్యక్రమం తర్వాత తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు.
రేవంత్ పర్యటన నేపథ్యంలో సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియం, మున్సిపల్ కార్యాలయ పరిసరాల్లో సభ ఏర్పాట్లను కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, ఇతర శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సభకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నందున, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
లక్షమందితో సీఎం సభ: జగ్గారెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. శుక్రవారం సభ ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. లక్ష మందితో సీఎం సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సంగారెడ్డి ఐబీ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్గాంధీల విగ్రహాలను ఆవిష్కరించనున్నారని తెలిపారు. సభకు వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జర్మన్ షెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు జగ్గారెడ్డి వెల్లడించారు.

