కలం, నిర్మల్: సోన్ (Soan) మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.10 లక్షలతో నూతనంగా నిర్మించిన మహిళా మత్స్యకారుల భవనాన్ని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మత్స్య పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మహిళలకు ఈ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని అన్నారు.
మత్స్యకారుల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, వారికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని ఏలేటి మహేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. మహిళా మత్స్యకారులు ఈ భవనాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వనజ, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు.

