కలం, వనపర్తి: పాలిటెక్నిక్ కళాశాలలను ‘శక్తి’ శాఖలో విలీనం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది డిమాండ్ చేశారు. గురువారం వనపర్తి (Wanaparthy)లోని కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వారు మాట్లాడారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకోకుండా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు.
విలీనంతో ఉద్యోగుల సర్వీసు, పదోన్నతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలకు ఏఐసీటీఈ గుర్తింపు కొనసాగించేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, సంబంధిత వర్గాలతో సమగ్రంగా చర్చించిన తర్వాతే విలీనంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

