కలం, నల్లగొండ బ్యూరో: రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ఎవని పాలైందిరో తెలంగాణ అనిపిస్తోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) వ్యాఖ్యానించారు. రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొద్దిరోజులుగా పార్టీలో పదవుల కేటాయింపు, తనకు మంత్రి పదవి నిరాకరణ గురించి బహిరంగంగానే విమర్శలు చేస్తున్న రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వారికే కీలక పదవులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఆంధ్రా నేతల మోచేతి నీళ్లు తాగిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్లు కీలక పదవుల్లో ఉండటం చూస్తుంటే బాధేస్తోందని రాజగోపాల్రెడ్డి అన్నారు. ప్రాణ త్యాగం చేసిన అమరుల ఆత్మ ఘోషిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీలో ఉన్నా తనది ప్రజా పక్షమేనని తెలిపారు. ప్రజల తరఫున అన్ని అన్యాయాలను ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా ఎవరికీ న్యాయం జరగడం లేదన్నారు.
కొందరు అధికారాన్ని అడ్డుపెట్టుకుని, అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. అవినీతి, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. “మేము నిజాయితీపరులం, మౌనంగా ఉన్నామని మా సహనాన్ని, ఓపికను చేతకానితనంగా భావించవద్దు. అవసరమైనప్పుడు ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు వెనుకాడబోం” అని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
విద్యార్థులు, నిరుద్యోగులు, యువత, రైతులు, పేదలు, అక్కాచెల్లెళ్ల భవిష్యత్తు కోసం అవినీతిపై యుద్ధం చేస్తామని ప్రకటించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజల సొత్తును దోచుకునే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయమని, తమ పోరాటంలో భయపడే ప్రసక్తే లేదని, ప్రజల తరుఫున న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సొంత పార్టీని ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి.

