కలం, వెబ్ డెస్క్: కొడంగల్లో ఓడిపోయిన తనను మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించడంలో కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలు కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. అప్పుడు ఎంపీగా గెలిచినా.. ప్రతిపక్షంలో ఉండటం వలన అనుకున్న పనులు చేయలేకపోయినట్లు వివరించారు. ఈ రోజు రాష్ట్రానికి తానే సీఎంగా ఉన్నానని, కూకట్పల్లి ప్రజలు ఏం అడిగినా ఇచ్చేస్తానని స్పష్టం చేశారు. ఈ విషయంలో మంత్రి శ్రీధర్ బాబు చొరవ తీసుకుని, అవసరమైనవి మంజూరు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ టవర్స్ మొదటగా కూకట్ పల్లిలోనే ప్రారంభిస్తానని.. రూ.వందల కోట్ల విలువైన 11 ఎకరాల భూమిలో ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు.
అక్కడికి పేదలు ఎలా వెళ్లాలి..
గత ప్రభుత్వంలో పేదల కోసం ఎక్కడో నగరానికి చివరన నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో పని చేసే ప్రదేశానికి, ఉండే ఇంటికి చాలా దూరం ఉండటంతో అక్కడికి వెళ్లడానికి ఎవరూ సిద్ధపడలేదన్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడ పేదలు ఉంటారో.. అక్కడే ఇళ్లు కట్టాలని తన ప్రభుత్వం నిర్ణయించుకుందన్నారు. పేదల సొంతింటి కల నెరవేరేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందన్నారు. ఇంటి నిర్మాణంలో రూ.5 లక్షలు కడితే చాలు, మిగిలిన డబ్బులు ప్రభుత్వం ఇచ్చి.. అద్భుతంగా నిర్మించి ఇస్తుందన్నారు. హైదరాబాద్ నగరంలో లక్ష ఇళ్లు కట్టాలన్నా భారీ సంకల్పాన్ని తీసుకున్నామని.. దీన్ని పూర్తి చేసినట్లు వివరించారు.

