కలం, నిర్మల్: రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR)గా ఎఫ్సీఐకి నిర్ణీత గడువులోగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా (BJP Kisan Morcha) ఆధ్వర్యంలో గురువారం జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జక్కుల సత్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలలో సీఎంఆర్ లక్ష్యం, ఇప్పటివరకు సరఫరా చేసిన పరిమాణం, పెండింగ్లో ఉన్న సీఎంఆర్ వివరాలను ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని కోరారు.
పెండింగ్ సీఎంఆర్ సరఫరాను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. మిల్లింగ్, రవాణా, నిల్వకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లాల వారీగా సీఎంఆర్ పురోగతి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. అలాగే సీఎంఆర్ సరఫరాలో జాప్యం కారణంగా ప్రభుత్వంపై పడుతున్న అదనపు ఆర్థిక భారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు.

