కలం, వనపర్తి : ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా శ్రీశైలం నీటిని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (కేఎల్ఐ) ద్వారా అందించే అవకాశాలను పరిశీలించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. ఇప్పటికే వరి సాగు చేసిన రైతులను ఆదుకునేందుకు అవసరమైన మేరకు సాగునీరు అందించాలని సూచించారు. నీటి లభ్యతను బట్టి భవిష్యత్లో ఆరుతడి పంటల వైపు రైతులను మళ్లించి, ముందుగానే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
వనపర్తి జిల్లా కలెక్టరేట్లో బుధవారం ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, నీటిపారుదల, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, ప్రాజెక్టుల నీటి నిల్వలు, సాగు, తాగునీటి అవసరాలపై సమీక్షించారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లను నింపేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి కోరారు. నీటిపారుదల అధికారులు సమన్వయంతో పనిచేసి కొంతమేర నీటిని విడుదల చేస్తే ఇప్పటికే వరి సాగు చేసిన రైతులు నష్టపోకుండా బయటపడే అవకాశం ఉంటుందన్నారు. కొత్తకోట మండలంలోని శంకర సముద్రం రిజర్వాయర్ను కూడా నింపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

