కలం, వెబ్డెస్క్: ఏపీలో జరుగుతున్న రాజకీయాల నేపథ్యంలో ఏపీ కూటమి (AP NDA Alliance) సర్కార్ కార్యకర్తలకు, అభిమానులకు కీలక ప్రకటన విడుదల చేసింది. వైసీపీ కూటమి ఐక్యతను దెబ్బ తీస్తోందని, ఇందులో భాగంగా ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లతో దుష్ప్రచారం మొదలు పెట్టిందని కూటమి పార్టీల నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు, అభిమానులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఇటీవల కూటమి పార్టీల అభిమానులు, కార్యకర్తల ముసుగులో వైసీపీ ఫేక్ అకౌంట్లు, సూడో అభిమానులుగా వ్యవహరిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. వీరు ఒక పార్టీకి అభిమానుల్లా నటిస్తూ, మరో మిత్రపక్ష నాయకులను తీవ్రంగా విమర్శించడం, వ్యక్తిగతంగా దూషించడం లేదా వారి ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్టులు, కామెంట్లు చేయడం వంటి పనులు చేస్తున్నారన్నారు.
టీడీపీ అభిమానిలా కనిపించే ఒక ఫేక్ అకౌంట్ చంద్రబాబును పొగుడుతూనే పవన్ కల్యాణ్ను విమర్శించవచ్చన్నారు. జనసేన అభిమానిలా కనిపించే ఫేక్ అకౌంట్ చంద్రబాబును విమర్శించవచ్చని చెప్పారు. దీంతో అసలైన కార్యకర్తలు ఆవేశానికి లోనై మిత్రపక్షాలపై పరస్పరం దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. చివరకు మనలో మనమే గొడవపడుతూ, వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం కల్పిస్తున్నామని తెలిపారు.
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి వైసీపీ వ్యూహాలను తిప్పికొట్టి, కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో మనమే విభేదాలు సృష్టించుకోవడం మిత్ర ధర్మానికి విరుద్ధమని స్పష్టం చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

