కలం,హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రైల్ రెండో దశలో భాగంగా ఓల్డ్ సిటీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ. పొడవునా రోడ్డు విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కారిడార్లో మెట్రో పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియను మొదలుపెట్టాలని చెప్పారు. మెట్రో విస్తరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూ సేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్)పై ఉన్నతాధికారులతో మంగళవారం సీఎం రేవంత్ సమీక్షించారు. పాతబస్తీ మెట్రో పనులపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
– హైదరాబాద్ మెట్రోకు రోజురోజుకు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రద్దీకి తగ్గట్టు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. ప్రయాణికుల రద్దీకి తగినట్టుగా మెట్రో రైల్కు అదనపు బోగీలను జత చేయాలన్నారు. ఇందుకు సంబంధించి మెట్రో రైల్ కోచెస్ను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
– మెట్రో ఫేజ్-2 లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ. కారిడార్ కోసం ప్రస్తుత టెక్నాలజీపై ఢిల్లీ మెట్రోను సంప్రదించి అవసరమైన సలహాలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
డిసెంబర్లో గ్లోబల్ సమ్మిట్
డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించనున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచనలు చేశారు. వ్యాపార రంగంలోని వివిధ సెక్టార్లలో గుర్తింపు పొందిన ప్రముఖులను సమ్మిట్లో సన్మానించేలా కార్యాచరణను ఆయన సూచించారు. ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సమ్మిట్ ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలన్నారు.
గత ఏడాది నిర్వహించిన సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, వాటి పురోగతిపై పూర్తి వివరాలను నివేదించాలని ఆయన ఆదేశించారు. పెట్టుబడుల్లో మరింత పురోగతి కోసం అవసరమైన ప్రణాళికలను సిద్దం చేయాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, ప్రభుత్వ సలహాదారులు రామకృష్ణారావు, ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండీ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

