కలం, స్పోర్ట్స్: 2005లో ఢిల్లీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార్ (Kumar Sangakkara) సంగక్కరతో జరిగిన తీవ్ర వాగ్వాదాన్ని భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) తాజాగా గుర్తుచేసుకున్నారు. జియోహాట్స్టార్లో ప్రసారమైన ‘చీకీ సింగిల్స్’ కార్యక్రమంలో పాల్గొన్న పఠాన్ ఈ పాత సంఘటనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో బంతిని మార్చడంపై శ్రీలంక ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో సంగక్కర తీవ్రంగా నిరసన తెలిపినట్లు పఠాన్ పేర్కొన్నారు. ఆ తర్వాత భారత జట్టు తరఫున ఓపెనర్గా బరిలోకి దిగిన పఠాన్ 93 పరుగులతో అదరగొట్టారు. ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్లో రెండు సిక్సర్లు కూడా బాదారు.
తన దూకుడైన బ్యాటింగ్తో శ్రీలంక జట్టు వ్యూహాలను దెబ్బతీయడంతో సంగక్కర తీవ్ర అసహనానికి గురయ్యాడని పఠాన్ (Irfan Pathan) తెలిపారు. ఈ క్రమంలో సంగక్కర తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశాడని, భారతీయులు మోసం చేస్తారంటూ మాట్లాడటంతో పాటు కుటుంబ పెంపకాన్ని కూడా ప్రస్తావించాడని చెప్పారు. దీంతో తాను కూడా అదే స్థాయిలో స్పందించానని పఠాన్ వెల్లడించారు. అయితే ఆ వివాదం అక్కడితో ఆగిపోలేదు. ఆ తర్వాత ఐపీఎల్లో ఇద్దరూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున కలిసి ఆడాల్సి వచ్చింది. ఆ సమయంలో సంగక్కర కుటుంబంతో కలిసి భోజనం చేస్తున్న సందర్భంగా పఠాన్ అతడిని కలిసి క్షమాపణలు చెప్పాడు. సంగక్కర కూడా తనకు క్షమాపణలు చెప్పడంతో అప్పటి వివాదానికి ముగింపు పలికినట్లు పఠాన్ తెలిపారు. ఆ సంఘటన తర్వాత తామిద్దరం మంచి స్నేహితులుగా మారామని ఇర్ఫాన్ పఠాన్ చెప్పారు. మ్యాచ్లో భావోద్వేగాలు తీవ్ర స్థాయికి చేరడం సహజమేనని, అయితే ఆ సమయంలో జరిగిన పొరపాట్లను తర్వాత పరిణతితో పరిష్కరించుకోవడం ముఖ్యమని ఈ ఘటన నిరూపిస్తుందని పేర్కొన్నారు.

