కలం, నిర్మల్: స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీజేపీ ఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) పిలుపునిచ్చారు. ఈ నెల 13న నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న భారీ తిరంగా ర్యాలీని (Tiranga Rally) విజయవంతం చేయాలని కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంపై ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశభక్తిని చాటేలా నిర్వహించనున్న తిరంగా ర్యాలీలో యువత, దేశభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 13న ఉదయం 10.30 గంటలకు నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుంచి వివేక్ చౌక్ వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ సమైక్యత, దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను గౌరవిస్తూ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోరారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేసి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని సూచించారు.

