కలం, వనపర్తి: యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖిల్లాఘణపురం (Khilla Ghanpur) బెస్తగేరి ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరంలో 20 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కాగితాల మధు మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చన్నారు.
ఆరోగ్యవంతమైన యువతీ యువకులు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు. ఒకరు రక్తదానం చేయడం ద్వారా ముగ్గురి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న రక్తదాతలకు ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ల్యాబ్ టెక్నీషియన్లు, యువశక్తి ఫౌండేషన్ ప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు.

