కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy Gurukul) జిల్లా జిన్నారంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల (TTWRJC)లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పదో తరగతి, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల మధ్య చిన్నపాటి వివాదం జరిగింది. ఈ వివాదం చెలరేగి, పరస్పరం దాడి చేసుకునే వరకు వెళ్లింది. పరిస్థితిని అదుపు చేయడానికి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సుజేంద్ర కుమార్, జూనియర్ లెక్చరర్ సృజన్ ‘డయల్ 100’కు ఫోన్ చేసి పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకుని వచ్చిన జిన్నారం పోలీస్ స్టేషన్కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు సుమారు 30 మంది విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల తీరుపై గురుకుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గొడవను సర్దిచెప్పాల్సిన పోలీసులే ఈ రకంగా విచక్షణారహితంగా దాడి చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై సదరు ఎస్సైకి ఫిర్యాదు చేయగా “ఇంకా ఎక్కువ కొట్టాల్సింది” అంటూ నిర్లక్ష్యంగా జవాబిచ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

