కలం మెదక్ బ్యూరో: గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి (Gajwel Government Hospital ) లోని వైద్యుల అటెండెన్స్ రిజిస్టర్ను మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొందరు వైద్యులు ఆసుపత్రికి రాకపోయినా, విధులకు వచ్చినట్లుగా రిజిస్టర్లో సంతకాలు పెడుతున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ‘శిశిర హాస్పిటల్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, టెస్టింగ్ హెల్త్ క్యాంప్ను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోకి ప్రతిరోజూ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లు, ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించిన బ్రోకర్లు ఎందుకు వస్తున్నారని వైద్యాధికారులను ఎంపీ నిలదీశారు. రోగులను ప్రైవేట్ సంస్థలకు మళ్లిస్తున్న బ్రోకర్లపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయడంలేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు సరైన వైద్యం అందాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు.

