కలం, వెబ్ డెస్క్: నీట్ పరీక్ష పేపర్ లీక్ వివాదం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడంపై సీనియర్ బీజేపీ నేత ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) తొలిసారిగా స్పందించారు. భువనేశ్వర్లోని జీఎం విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులనుద్దేశించి ప్రసంగించార. జెన్-జీ (Gen Z) యువతను కొందరు కావాలనే తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. తనకు మంత్రి పదవి ఎప్పుడూ ముఖ్యం కాదని, తానే స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాజీనామా ప్రతిపాదనను సమర్పించానని ఆయన స్పష్టం చేశారు. భారతదేశ యువత భవిష్యత్తు కోసం ఆకాంక్షలు ఉన్నాయని, గత పదేళ్లలో దేశంలో సుమారు 20 కోట్ల మంది పిల్లలు జన్మించారన్నారు. వారే దేశాన్ని ‘విశ్వ గురు’గా తీర్చిదిద్దుతారని ప్రధాన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఒడిశాలోని రైరాఖోల్లో జరిగిన సమావేశంలో బీజేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్పై ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు. విమానాశ్రయం వద్ద బీజేడీ కార్యకర్తలు తనపై “ధర్మేంద్ర ప్రధాన్ గో బ్యాక్” అంటూ నినాదాలు చేయడం పట్ల తాను ఎలాంటి అశాంతికి గురికాలేదని చెప్పారు. తాను రైతు బిడ్డనని, తనను వెనక్కి వెళ్లమన్నా తాను మళ్లీ తిరిగి వస్తానని తేల్చిచెప్పారు. తనను రాష్ట్రానికి కళంకం అని, చెడ్డవాడని నవీన్ బాబు అంటున్నారని, కానీ తాను ఒడిశా ప్రజలకు తలవంపులు తెచ్చే పనులెప్పుడూ చేయలేదని స్పష్టం చేశారు. లార్డ్ జగన్నాథ్, మాతా సమలేశ్వరి ఆశీస్సులతో 12 ఏళ్ల క్రితం తాను కేంద్ర మంత్రి అయ్యానని, తన రాజకీయ ప్రయాణంలో రాష్ట్ర కీర్తిని ఎప్పుడూ మంటకలపలేదని ప్రధాన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

