కలం, తెలంగాణ బ్యూరో: ఇటీవల మృతి చెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy ) కుటుంబాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఆదివారం పరామర్శించనున్నారు. ఇందుకోసం ఆయన ఎర్రవల్లిలోని తన ఫామ్హౌజ్ నుంచి పెద్ది స్వగ్రామమైన నల్లబెల్లికి వెళ్లనున్నారు. తొలుత భారీ స్థాయిలో కారు ర్యాలీగా వెళ్లాలని భావించినా.. ఆ తర్వాత ఆ ఆలోచనను మార్చుకున్నట్లు తెలిసింది. కేసీఆర్ ప్రయాణించే సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎర్రవల్లి ఫామ్హౌజ్ నుంచి బయలుదేరిన తర్వాత వరంగల్ జిల్లా సరిహద్దుల్లోకి చేరుకున్న అనంతరం అక్కడి నేతలు, పార్టీ శ్రేణులు ర్యాలీగా నల్లబెల్లికి వెళ్లనున్నారు.
– పెద్ది సుదర్శన్ రెడ్డి గత నెల 31వ తేదీ రాత్రి మృతి చెందడంతో ఆయన కుటుంబానికి పార్టీ తరఫున రూ.2.25 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని కేసీఆర్ ప్రకటించారు. పెద్ది మృతి చెంది 11 రోజులు కావస్తుండటంతో.. వారి ఇంట్లో నిర్వహించే కార్యక్రమానికి హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చనున్నారు.
– పెద్ది కుమారుడు, కుమార్తె పేర్లపై తలా రూ.కోటి చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేయడంతో పాటు.. వృద్ధాప్యంలో ఉన్న ఆయన తల్లి అవసరాల కోసం రూ.25 లక్షలు అందించనున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ ఆర్థిక సాయాన్ని కేసీఆర్ స్వయంగా కుటుంబ సభ్యులకు అందజేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

