కలం, జనగామ: రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య (MP Kadiyam Kavya) ధీమా వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్కు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోందని, రానున్న రోజుల్లో బీజేపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. జనగామ జిల్లా కాంగ్రెస్ నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శనివారం ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
పార్లమెంట్లో కీలక బిల్లులను రెండు మూడు నిమిషాల్లోనే ఆమోదిస్తున్నారని, ఎంపీల అభిప్రాయాలకు కేంద్రం విలువ ఇవ్వడం లేదని కడియం కావ్య విమర్శించారు. డీలిమిటేషన్ పేరుతో బీజేపీ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ దొంగ దెబ్బలపై అప్రమత్తంగా ఉండాలని, గ్రూపు రాజకీయాలకు తావులేకుండా కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

