కలం, కరీంనగర్ : కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈరోజు ఉదయం కరీంనగర్ (Karimnagar) రూరల్ పోలీస్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో గోపాల్పూర్ గ్రామం, గుంటూరుపల్లి గ్రామం, బైపాస్లోని జియో పెట్రోల్ బంక్ సమీపంలో ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు.
పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్లను విచారించగా, వారు బేథి సునీల్ రెడ్డి, కొత్తూరి కుమార్, కొత్తూరి ఆంజనేయులు, పోస్టు గణేష్, గడిప్ర బాలయ్యగా తమ వివరాలను వెల్లడించారు. సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి మానేరు వాగు నుండి ఇసుకను అక్రమంగా ట్రాక్టర్లలో నింపుకొని, కరీంనగర్ పట్టణంలో అధిక ధరకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు వారు పోలీసుల విచారణలో వెల్లడించారు.
ఈ మేరకు ఐదు ట్రాక్టర్లను పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకొని, ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితులపై కేసులు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లను తదుపరి చర్యల నిమిత్తం కోర్టులో డిపాజిట్ చేయనున్నారు. నిందితులను కూడా తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నారు.
గత కొద్ది రోజులుగా సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి మానేరు వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై పలుమార్లు కేసులు నమోదు చేసినప్పటికీ, కొందరు తమ తీరు మార్చుకోకుండా మళ్లీ అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే కొందరిపై హిస్టరీ షీట్లు కూడా తెరవడం జరిగిందన్నారు.
ఇకపై అక్రమ ఇసుక రవాణాను ఏమాత్రం ఉపేక్షించేది లేదని, చట్టాన్ని ఉల్లంఘించి ఇసుకను అక్రమంగా తరలించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ. నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. పదేపదే అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతూ పట్టుబడే వారిపై, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా రౌడీ షీట్, పీడీ యాక్ట్ తదితర కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపుతామని హెచ్చరించారు.
Also Read : ఆస్తి కోసం ఇంత దారుణమా?.. అత్తను చంపి, ఆపై మృతదేహాన్ని!
Follow Us On: X(Twitter)

