కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా హైడ్రా (Hydra) డ్రైవర్ పోస్టుల భర్తీ సమయంలో అధికారులు నిరుద్యోగుల పట్ల ప్రవర్తించిన తీరుపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్విటర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆయన, ఎన్నికల సమయంలో ఉద్యోగాలు ఇస్తామని పెద్ద పెద్ద హామీలు ఇచ్చి, తీరా ఇప్పుడు హక్కుల కోసం రోడ్లెక్కిన యువతపై కర్కశంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
కేవలం 150 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తే వేలాది మంది నిరుద్యోగులు క్యూ కట్టారని, ఇది నిరుద్యోగుల లోపం కాదని, ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిన కాంగ్రెస్ ప్రభుత్వ లోపమేనని మండిపడ్డారు. కొలువుల కోసం వచ్చిన యువతను గౌరవించాల్సిన అధికారులే వారిని అవమానించడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిజంగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే ఈ రోజు నిరుద్యోగులకు ఈ దుస్థితి వచ్చేది కాదని హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీ, జాబ్ క్యాలెండర్ అన్నీ బోగస్ అని తేలిపోయాయని ధ్వజమెత్తారు. ప్రస్తుత పాలనలో ఉద్యోగార్థుల్లో నిరాశ నిస్పృహలు పెరిగిపోతున్నాయని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు.
Also Read : యూపీఐ ఛార్జీలపై ఫోన్ పే కీలక ప్రకటన
Follow Us On : WhatsApp

