కలం, నిర్మల్: ఆరోగ్యశ్రీ పథకం సాధనలో ఎమ్మార్పీఎస్ (MRPS) అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పోరాటం కీలకమైందని ఎమ్మార్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ప్రజలకు అరటిపండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఎంఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి డాక్టర్ కొమ్ము శేఖర్ మాట్లాడారు.
2004 ఆగస్టు 7న మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగిన ఉద్యమ ఫలితంగానే ఆరోగ్యశ్రీ పథకం అమలులోకి వచ్చిందన్నారు. ఈ పథకం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుపేదలకు సంజీవనిలా ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ స్ఫూర్తితోనే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొబ్బిలి శ్రీనివాస్, శనిగారపు రవి, మహేశ్వర్, అరుణ్, నామత్కార్ లక్ష్మణ్, వెంకటరమణ, రాజు, శంకర్ పాల్గొన్నారు.

