కలం, వనపర్తి: వనపర్తిలో (Wanaparthy) ఎంతో మంది విద్యార్థులను క్రమశిక్షణ కలిగిన యువతగా తీర్చిదిద్దిన ప్రముఖ వ్యాయామ అధ్యాపకులు (ఫిజికల్ డైరెక్టర్) జగన్మోహన్ రెడ్డి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో కన్నుమూశారు. దశాబ్దాల పాటు విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి విశేష సేవలందించిన జగన్మోహన్ రెడ్డి అంతిమయాత్రకు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ఆయన శిష్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
గురువుపై తమ అభిమానాన్ని చాటుతూ పార్థివదేహానికి పూలమాలలు సమర్పించి, పాడె మోసి భావోద్వేగంతో చివరి వీడ్కోలు పలికారు. ఆయన మృతి విద్యా రంగానికి, శిష్యులకు తీరని లోటని మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ వాకిటి శ్రీధర్ అన్నారు. పలువురు శిష్యులు గురువు పాదాలకు నమస్కరించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్, పెద్దయ్య, భీంరెడ్డి, వెంకటరెడ్డి, మురళి, నాగార్జున్, రఘువీర్ రెడ్డి, రవిశంకర్, మల్లి, ట్రాన్స్కో చంద్రశేఖర్, శివ తదితరులు పాల్గొన్నారు.

