కలం, స్పోర్ట్స్ : భారత ఏరోబిక్ జిమ్నాస్టిక్స్లో కొత్త చరిత్ర రాసింది అరిహా పంగంబం (Ariha Pangambam) . ఆసియా చాంపియన్షిప్ సీనియర్ మహిళల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించి దేశానికి తొలి బంగారు పతకాన్ని అందించింది. ఫిలిప్పీన్స్లో జరిగిన 2026 ఏరోబిక్ జిమ్నాస్టిక్స్ ఆసియా చాంపియన్షిప్లో భారత క్రీడాకారిణి అరిహా పంగంబం చారిత్రక విజయం సాధించింది. సీనియర్ మహిళల వ్యక్తిగత విభాగంలో 19.100 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆర్టిస్ట్రీలో 8.650, ఎగ్జిక్యూషన్లో 7.600, డిఫికల్టీలో 2.850 మార్కులు సాధించిన అరిహా మొత్తం స్కోరుతో విజేతగా నిలిచింది. ఈ విజయంతో ఏరోబిక్ జిమ్నాస్టిక్స్ ఆసియా చాంపియన్షిప్ సీనియర్ మహిళల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయురాలిగా ఆమె రికార్డు సృష్టించింది.
మణిపూర్కు చెందిన అరిహా గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ స్థాయిలో భారత తరఫున పోటీపడుతోంది. 2024 ఆసియా చాంపియన్షిప్లో ఫైనల్ చేరిన ఆమె, ఈసారి స్వర్ణ పతకంతో తన ప్రస్థానాన్ని మరో మెట్టుకు తీసుకెళ్లింది. ఈ విజయంపై జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సుధీర్ మిత్తల్ స్పందిస్తూ, అరిహా అద్భుతంగా ప్రదర్శన ఇచ్చిందని, ఆమెతో పాటు కోచ్ కృషి కూడా అభినందనీయమని తెలిపారు. ఆగస్టు 4 నుంచి 7 వరకు ఫిలిప్పీన్స్లో జరిగిన ఈ టోర్నీలో భారత్కు ఈ స్వర్ణ పతకం ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.

