కలం, కరీంనగర్ బ్యూరో: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సహారా బాధితులు నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ (MP Vamsi Krishna) హాజరై తన సంఘీభావాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది డిపాజిటర్లు, ఏజెంట్లు, మద్దతుదారులు తమ కష్టార్జిత సొమ్మును వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ నిరసనలో ఎంపీ వంశీకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడిన ఎంపీ వంశీకృష్ణ డిపాజిటర్ల సమస్యను పరిష్కరించడం అత్యవసరమని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బాధితుల ఆవేదనకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.

