కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇటీవల జరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. దొంగతనాలను అరికట్టడంతోపాటు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల (Nirmal SP Janaki Sharmila) తెలిపారు. ఇందుకోసం నిర్మల్ పట్టణం చుట్టూ ఏడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గురువారం సాయంత్రం పట్టణ శివారులోని సెయింట్ థామస్ స్కూల్ సమీపంలో ఏర్పాటుచేసిన చెక్ పోస్టును తనిఖీ చేశారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. రాత్రి వేళల్లో మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
దొంగతనాలకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని, త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే, ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాస్, టౌన్ సీఐ సమ్మయ్య, రూరల్ ఎస్సై లింబాద్రి ఉన్నారు.
Also Read : భారత్కు మరో మైలురాయి.. అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష సక్సెస్
Follow Us On : WhatsApp

