కలం, మహబూబ్ నగర్ బ్యూరో : విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటం చేయడమే ఏఐఎస్ఎఫ్ (AISF) ధ్యేయమని ఆ సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు అన్నారు. గురువారం మహబూబ్నగర్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు మాట్లాడుతూ, 1936లో ఏర్పడిన దేశంలోని తొలి విద్యార్థి సంఘమైన ఏఐఎస్ఎఫ్ ఎనిమిది దశాబ్దాలుగా విద్యార్థుల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విద్యాభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం కోసం రాజీలేని పోరాటాలు చేస్తూ వస్తోందన్నారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమం నుంచి నేటి వరకు విద్యార్థి, యువజన, ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ఏఐఎస్ఎఫ్, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణ కోసం కూడా నిరంతరం ఉద్యమిస్తోందన్నారు.
విద్యార్థుల హక్కులను కాపాడుకోవాలంటే సంఘటిత శక్తి అవసరమని, ప్రతి విద్యార్థి ఏఐఎస్ఎఫ్ సభ్యత్వం తీసుకుని ఉద్యమంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, నాయకులు భరత్, శీను పాల్గొన్నారు.

