కలం, వెబ్డెస్క్: హైదరాబాద్లో కల్తీ ఆహార పదార్థాల దందాపై ఉక్కు పాదం మోపుతున్న హెచ్ ఫాస్ట్ (H-Fast) అధికారులను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) అభినందించారు. కాటేదాన్, బాలాపూర్, మైలార్దేవల్పల్లిలో నకిలీ మసాలాలు తయారు చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పోలీసులు భారీ ఎత్తున నకిలీ మసాలాలు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. సీపీ సజ్జనార్ స్వయంగా నకిలీ మసాలాలను పరిక్షించి ప్రజలకు వివరించారని తెలిపారు. తన నియోజకవర్గంతో పాటు బయట నుంచి కల్తీ పదార్థాలు వస్తున్నాయని,వారిపై చర్యలు తీసుకోవాలని గతంలో లేఖ రాశానని వెల్లడించారు.
అయితే ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష ఉంటే పోలీస్ స్టేషన్లో వారికి స్టేషన్ బెయిల్ వస్తోందని రాజాసింగ్ అన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు కీలక సూచనలు చేశారు. సెక్షన్లలో మార్పులు తీసుకురావాలని, నిందితులపై పీడీ యాక్ట్ వేయాలని చెప్పారు. నిందితులు ఏయే షాపులకు అమ్ముతున్నారో వారి షాపులు కూడా సీజ్ చేయాలన్నారు. అలాగే నిందితుల ఫోటోలు, వారు ఎక్కడి నుంచి కల్తీ చేస్తున్నారు, ఏయే పదార్థాలు కల్తీ అవుతున్నాయనే విషయం ప్రజలకు తెలియాలన్నారు. అప్పుడు వాళ్లు జైలు నుంచి బయటకు వచ్చినా కూడా ప్రజలు జాగ్రత్తగా ఉంటారని, వాళ్ల దగ్గర మరోసారి ఎలాంటి పదార్థాలు కొనరని చెప్పారు.
సుల్తాన్ బజార్లో చాలా వరకు నకిలీ వైర్లు, ఎలక్ట్రిక్ సామాన్లు అమ్ముతున్నారని చెప్పారు. ఇలాంటి నాసిరకం వైర్లతో అపార్ట్మెంట్లలో పను చేస్తే అగ్ని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఒక వేళ సదరు కంపెనీ వాళ్లను అరెస్ట్ చేసినా స్టేషన్లో బెయిల్ వస్తోందన్నారు. దాంట్లో కూడా మార్పులు తీసుకురావాలని కోరారు. ఆ దుకాణాలను సీజ్ చేయాలన్నారు. జగదీష్ మార్కెట్లో ఫేక్ ఐఫోన్, సామ్సంగ్ కంపెనీల ఫోన్లు, చోరీ అయిన ఫోన్లు కూడా అమ్ముతున్నారని చెప్పారు. వీరిని అరెస్ట్ చేయడానికి కూడా ఒక ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సెక్షన్లలో మార్పుల కోసం కొత్త జీవో తీసుకొచ్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించాలని కోరారు.

