కలం, వెబ్డెస్క్: హైదరాబాద్ (Hyderabad) లోని ఓ జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ (Ragging) ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఓ జూనియర్ విద్యార్థిపై సీనియర్లు దాడి చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తపేటలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో కొద్ది రోజుల కిందట ఫ్రెషర్స్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో తలెత్తిన వివాదం తర్వాత ఫస్ట్ ఇయర్ ఇంటర్ విద్యార్థిపై ముగ్గురు సీనియర్ విద్యార్థులు దాడి చేశారు. బాధిత విద్యార్థి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
సీనియర్ విద్యార్థులు బెల్ట్తో కొట్టడంతో పాటు ముఖంపై పిడిగుద్దులు కురిపించినట్లు ఫిర్యాదు పేర్కొన్నారు. దాడిలో బాధిత విద్యార్థి ముక్కు ఎముక విరిగింది. ఆస్పత్రికి తరలించగా, శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. ఘటన జరిగిన వెంటనే బాధితుడికి వైద్య సహాయం అందించకుండా కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురు మైనర్ విద్యార్థులతో పాటు కాలేజీ యాజమాన్యంపై కూడా తెలంగాణ ర్యాగింగ్ నిరోధక చట్టం, బీఎన్ఎస్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

